పార్లమెంటులో ఈ వారం
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో మాట్లాడుతూ భారతదేశాన్ని తమ ప్రభుత్వం మరింత ఉన్నత స్థాయికి తీసుకువెడుతుందన్నారు. ‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ ప్రతిపాదన ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతిపక్షాలు తమ సహకారాన్ని అందించాలని కోరారు. పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి కృతజ్ఘతలు తెలిపే తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేలా ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ప్రగతి పథంలో దూసుకుపోవడానికి అందివచ్చే ఏ అవకాశాన్ని భారత్ వదలదని ఆయన అన్నారు. భారత ప్రగతి, సుసంపన్నతలే ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలన్నారు. దేశం ఎదుర్కొంటున్న అన్ని రకాల సవాళ్లను ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ కలిసి పరిష్కరించే దిశగా పనిచేస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. దృఢమైన, సురక్షితమైన, అందరినీ కలుపుకుపోయే భారతాన్ని ఆవిష్కరించాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అవినీతి ప్రక్షాళణ, రైతుల సంక్షేమం, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను లేవనెత్తారు. దేశంలో అవినీతికి తావే లేదని ప్రధాని స్పష్టంచేశారు. అవినీతి ప్రక్షాళన కోసం తమ ప్రభుత్వం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని ఆయన అన్నారు. దేశంలోని నీటికర...