‘బ్లూ డాట్’తో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కొత్త అవకాశాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలి తన భారత పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విస్తృత చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చిన ప్రధానాంశాల్లో ‘‘బ్లూ డాట్’’ నెట్‌వ‌ర్క్‌ కూడా ఒకటి. ఈ చర్చల తర్వాత విడుదల చేసిన సంయుక్త పత్రికా ప్రకటనలో- ‘‘వర్ధమాన, అల్పాదాయ దేశాల్లో పేరుకుపోతున్న ప్రభుత్వ రుణభారాన్ని నియంత్రించే దిశగా రుణగ్రహీతలు-రుణదాతలు బాధ్యతాయుత, పారదర్శక, నిశ్చిత ఆర్థిక సహాయ పద్ధతులు పాటించాల్సిన అవసరాన్ని అమెరికా, భారత్ గుర్తించాయి’’ అని వారిద్దరూ పేర్కొన్నారు. ఆ మేరకు బహుపాక్షిక భాగస్వామ్య ‘బ్లూ డాట్’ నెట్‌వ‌ర్క్‌పై ట్రంప్, మోదీ ఆసక్తి వ్యక్తం చేశారు. దీనిద్వారా ప్రభుత్వాలు- ప్రైవేటు రంగం-పౌర సమాజం సమష్టిగా, అత్యున్నత నాణ్యత, విశ్వసనీయ ప్రమాణాలతో అంతర్జాతీయంగా మౌలిక వసతులను అభివృద్ధి చేసే వీలుంటుందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్లూ డాట్ నెట్‌వ‌ర్క్‌లో చేరే అవకాశాలను భారత్ పరిశీలిస్తోంది.

వర్ధమాన దేశాల్లో... ప్రత్యేకించి ఇండో-పసిఫిక్ ప్రాంతంలో విదేశీ నిధులతో మౌలిక వసతుల నిర్మాణంలో అంతర్జాతీయ ఆమోదంగల నియమనిబంధనలను పాటించేలా చూడటం బ్లూ డాట్ నెట్‌వర్క్ లక్ష్యం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ముఖ్యంగా ఆసియాలో మౌలిక వసతులపై పెట్టుబడి విధానాలు ఆర్థిక సహాయం పేరిట ఆయా దేశాలపై రుణభారాన్ని పెంచే విధంగా ఉన్నాయని భారత్, అమెరికా ఆందోళన వ్యక్తం చేశాయి. ‘ఒకే వలయం-ఒకే రహదారి’-OBOR పేరిట 2013లో చైనా చేపట్టిన ప్రాజెక్టుకు ఆ తర్వాత ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్’-BRIగా నామకరణం చేసింది. ఇందులో భాగంగా మౌలిక వసతుల నిర్మాణం కోసం పరిసర దేశాలకు రుణాలిచ్చింది. అయితే, సదరు రుణాల చెల్లింపులో శ్రీలంక, మాల్దీవ్స్, మలేషియా వంటి దేశాలు నేడు నానా ఇక్కట్లూ పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో 2019 నవంబరులో బ్యాంకాక్‌ ‘ఇండో-పసిఫిక్ వాణిజ్య మహాసభల’ సందర్భంగా జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు ‘బ్లూ డాట్’ నెట్‌వ‌ర్క్‌ను ప్రారంభించాయి. మౌలిక వసతుల అభివృద్ధిపై పెట్టుబడుల్లో రుణ-ఉచ్చు, పారదర్శకత లేమి, స్థిరత్వం లేకపోవడం తదితరాల వల్ల చిన్న, స్వల్ప-వర్ధమాన దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడం దీని లక్ష్యం. రుణాలిచ్చే సంస్థల విశ్వసనీయత తదితరాలపై కొన్ని పరామితుల ప్రాతిపదికన నిష్పాక్షిక, బహిరంగ మూల్యాంకన స్థాయిని ప్రకటించడం ‘బ్లూ డాట్ నెట్‌వర్క్’ ప్రధాన కర్తవ్యం. ఈ నిర్దిష్ట సమాచారం ఆధారంగా సంభావ్య రుణగ్రహీత దేశాలు రుణం పొందడంపై ఒక గట్టి నిర్ణయం తీసుకునే వీలు కలుగుతుంది. ప్రపంచ దేశాలు ఈ నెట్‌వ‌ర్క్‌ను- చైనా చేపట్టిన బీఆర్ఐకి అమెరికా ప్రతిస్పందనగా పరిగణిస్తున్నారు. దీనికి అవసరమయ్యే నిధులను ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలకు చెందిన ‘‘ఆస్ఎయిడ్, జపాన ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ఫైనాన్స్ కార్పొరేషన్’’ నిధులు సమకూరుస్తాయి. ఇక ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం ప్రైవేటు రంగం నుంచి నిధుల సమీకరణ ఈ నెట్‌వ‌ర్క్‌ యోచన. దీంతోపాటు బ్లూ డాట్ నెట్‌వ‌ర్క్‌ నాయకత్వ పాత్రనూ ప్రైవేటు రంగమే పోషించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో సదరు కార్పొరేషన్ ఇప్పటికే 50 బిలియన్ డాలర్లకుపైగా నిధులు సమీకరించినట్లు సమాచారం. అంతేకాకుండా దీనికి అమెరికన్ కాంగ్రెస్ మద్దతు కూడా లభించడం గమనార్హం. సదరు నెట్‌వ‌ర్క్‌ మూల్యాంకన స్థాయి మేరకు అమెరికా ప్రైవేటురంగ పెట్టుబడిదారులు ఇండో-పసిఫిక్ ప్రాంత స్వల్ప-వర్ధమాన దేశాల్లో పెట్టుబడులు పెట్టే వీలు కలుగుతుంది. దీంతో అటు రుణగ్రహీత దేశాలకు, ఇటు అమెరికా ప్రైవేటురంగ పెట్టుబడిదారులకు ఉభయతారకంగా ఉంటుందని అంచనా.

అయితే, ఈ ‘బ్లూ డాట్’ నెట్‌వ‌ర్క్‌ ఇంకా శైశవ దశలోనే ఉంది. ఇది ఏ విధంగా రూపుదాలుస్తుందో రాబోయే కొన్ని నెలల్లో స్పష్టం కానుంది. ఈ క్రమంలో ‘సురక్షిత’ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు అనే అంశానికి ఒక సమగ్రత, విశ్వవ్యాప్త ఆమోదయోగ్య నిర్వచనం ఇవ్వడం పెద్ద సవాలు అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం విదేశీ రుణం కోరడంలోగల సంభావ్య అవకాశాలు, ముప్పుల గురించి రుణగ్రహీత దేశాలకు అవగాహన కల్పించడంలో ఈ ధ్రువీకరణ వ్యవస్థ కచ్చితంగా సాయపడుతుంది. సంబంధిత ప్రాజెక్టుల ద్వారా ఒనగూడే ఆర్థిక సుస్థిరత, పారదర్శకత అంశాలపై నెట్‌వ‌ర్క్ నిశితంగా దృష్టి సారిస్తుంది కాబట్టి ధ్రువీకరణద్వారా రెండువైపులా ప్రయోజనం కలుగుతుంది. వర్ధమాన ప్రపంచం... ప్రత్యేకించి ఆసియా ప్రాంత దేశాలు మౌలిక వసతుల కల్పనకు తీవ్ర నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఆసియా అభివృద్ధి బ్యాంకు అంచనాల ప్రకారం... ఈ కొరతను తీర్చడానికి ఏటా 1.7 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరం. ఆ మేరకు భారీగా నిధులందితేనే ఆసియా ప్రాంత దేశాలు తమ మౌలిక వసతుల అనుసంధాన ప్రాజెక్టులను సాకారం చేసుకోగలవు. దీంతోపాటు తమ దేశాల్లోని జనాభాకు గరిష్ఠ ప్రగతి ప్రయోజనాలను అందించగలవు.

భారతదేశంలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం నమూనాలో దేశీయ మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బ్లూ డాట్ నెట్‌వ‌ర్క్‌ను మన దేశం ఓ సానుకూల పరిణామంగా పరిగణించవచ్చు. ఆ మేరకు బ్లూ డాట్ నెట్‌వర్క్ మద్దతుతో బాధ్యతాయుత, సమతుల సమ్మేళనంగా ప్రభుత్వ, ప్రైవేటు పెట్టుబడులు లభ్యమవుతాయి. ఆ నిధుల తోడ్పాటుతో దేశ మౌలిక వసతుల్లోగల ప్రస్తుత అంతరాలను తొలగించగల అద్భుత అవకాశం అందుబాటులోకి వస్తుంది.


రచన: డాక్ట‌ర్ రాహుల్ మిశ్రా, తూర్పు-ఆగ్నేయాసియా వ్య‌వ‌హారాల వ్యూహాత్మ‌క విశ్లేష‌కులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన