భారత రాజ్యాంగం - దేశ అత్యున్నత శాసనం
సంవిధానసభ మూడేళ్లు శ్రమించి రూపొందించిన భారత రాజ్యాంగం చివరకు చట్టరూపం దాల్చింది. ఈ రాజ్యాంగం దీర్ఘకాలం మనగలుగుతుందని కొద్దిమంది విశ్లేషకులు మాత్రమే గుండె మీద చెయ్యివేసుకుని చెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ అది ఇప్పటికీ స్థిరంగా, గట్టిగా నిలిచిందంటే అది దానిని నిర్మించిన వ్యవస్థాపక పితరుల వివేకసంపదకు, ముందు చూపుకు తార్కాణం. భారత రాజ్యాంగం శాసనకర్తలకు, సామాన్య పౌరులకు ఇరువురికి దిక్సూచిగా కాంతిరేఖగా పని చేస్తుంది. 7 దశాబ్దాలకు పైగా కాలంలో దాని మౌలిక నిర్మాణం చెక్కు చెదరకుండా నిలచింది. రాజ్యాంగంలో అనేకానేక సవరణలు జరిగినప్పటికీ దాని ఉపోద్ఘాతం నమ్మకం కలిగిస్తూ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
మేము - భారత ప్రజలం - అంటూ ప్రారంభమయ్యే ఉపోద్ఘాతం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వ సూత్రాలతో ముడివడిన ఒక సార్వభౌమ, లౌకికవాద, ప్రజాస్వామ్య గణతంత్రాన్ని ప్రపంచానికి అందజేసింది.
ఇది దేశ నిర్మాణం, దానిలోని విభాగాలను వివరించే చట్టబద్ధమైన పత్రం. అలాగే ప్రజల హక్కులు, స్వేచ్ఛలకు నిలువుటద్దంలా నిలచే ప్రమాణ పత్రం.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుపుకునే రాజ్యాంగాన్ని కొత్త కోణంలో ప్రజల మనసులకు హత్తుకుని పోయిన సజీవ పత్రంగా చెప్పాలి. 1950 జనవరి 26న గణతంత్రతంగా మారిన భారతదేశం అదే విధంగా కొనసాగుతోంది. గడచిన 7 దశాబ్దాలకు పైగా కాలంలో భారత ప్రజాస్వామ్యం మరింత బలంగా పెరిగింది; రాజ్యాంగం పట్ల ప్రతి భారతీయునికి గల అపార నమ్మకం, విశ్వాసమే ఇందుకు కారణం.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా రాజ్ పథ్ పై జరిగే అద్భుతమైన సైనిక కవాతు ప్రదర్శన భారత సైనిక పాటవాన్ని చాటి చెప్తుంది. వందకోట్ల మందికి పైగా భారతీయులు రాజ్యాంగానికి అంజలి ఘటించే శుభ సందర్భం అది. ఈ రాజ్యాంగమే ప్రతి భారత పౌరునికి అతనికి లేదా ఆమెకు గల స్వేచ్ఛకు హామీనిస్తుంది. అలాగే హక్కులకు కూడా హామీగా నిలుస్తుంది. భరత భూమికి చెందిన అత్యంత పవిత్రమైన ఈ పత్రంలో పొందుపరచిన తమ విధులను, బాధ్యతలను నిర్వర్తిస్తామని ప్రతి భారతీయుడు ప్రతిన చేసేది కూడా గణతంత్ర దినోత్సవం నాడే. రాజ్యాంగంలోని ఇదే స్ఫూర్తి దానిని ప్రతి పౌరునికి ప్రియతమంగా చేస్తుంది.
బ్రిటిష్ వలస పాలన నుండి స్వేచ్ఛ పొందేందుకు మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన జాతీయ పోరాటం ఫలితం గానే భారత రాజ్యాంగం ఉద్భవించిందని గుర్తు పెట్టుకోవాలి. బాపు రాజకీయ తత్వశాస్త్రం నుండి ప్రేరణ పొందిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అణగారిన వర్గాలకు సామాజిక సమానత్వం, న్యాయం అనే వాగ్దానాలతో చక్కగా తీర్చిదిద్ది రాజ్యాంగంపై తనదైన ముద్ర వేసారు.
ఇందులో ప్రముఖంగా చెప్పుకోవలసిన మరో లక్షణం ఏమిటంటే ప్రభుత్వ సమాఖ్య నిర్మాణం. రాష్ట్రాల యూనియన్గా వర్ణించిన భారత రిపబ్లిక్ కేంద్రీకృత సమాఖ్య పాలన పద్ధతిని ఏర్పాటు చేయగలిగింది. సమాఖ్య అధికార నిర్మాణంలో రాష్ట్రాలు అధికార కేంద్రాలుగా రూపుదాల్చటం రాజకీయ పరిణామం. దీనివల్ల సమాఖ్యవాదం క్రమంగా బలపడింది. పాశ్చాత్య ప్రజాస్వామ్యాల వలె భారత ఫెడరల్ నిర్మాణం అధికంగా కేంద్రీకృతం కానందున ఈ పరిణామం జరిగింది.
రాజ్యాంగంలో పొందుపరచిన పౌర హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలు ప్రజాస్వామ్య చట్టబద్ధతలో ముఖ్యమైన అంశాలు. భారత సుప్రీంకోర్టు వాటిని అనేకమార్లు సమర్ధించింది. భావ ప్రకటన స్వేచ్ఛ, పౌరులకు సమాచార హక్కుతోపాటు వ్యక్తిగత గోప్యత హక్కు భారత ప్రజాస్వామ్య యోగ్యతను మరింత సుసంపన్నంగా పటిష్టం చేసాయి. ఈనాడు భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోని అనేక ఇతర దేశాలకంటే మిన్నగా అభివృద్ధి చెందింది.
మన గణతంత్రం భవిష్యత్తుకు రాజ్యాంగం ఉత్తమ మార్గదర్శిగా కొనసాగుతోంది. రానున్న కాలంలో పౌరులు కూడా తమని రాజ్యాంగానికి జోడించే రాజ్యాంగంలోని వాగ్దానాలకు కట్టుబడాలి.
రచన : ప్రొ.బల్వీర్ అరోరా, అధ్యక్షుడు, ISS, మల్టీలెవెల్ ఫెడరలిజం కేంద్రం
Comments
Post a Comment