వ్యూహాత్మ‌క సంబంధాల‌ను ప‌టిష్టం చేసుకుంటున్న భార‌త్‌-ఒమ‌న్‌

ప‌ర్షియా జ‌లసంధి ముఖ‌ద్వారంలోగ‌ల ఒమ‌న్‌కు దాని పొరుగుదేశాల‌తో పోలిస్తే అంత‌ర్జాతీయంగా చెప్పుకోగ‌ద‌గిన గుర్తింపు ఏదీలేదు. అయితే, జ‌ల‌సంధిలోని వ్యూహాత్మ‌క ప్ర‌దేశంలో ఉన్న దృష్ట్యా భార‌త పొరుగు దేశాల జాబితాలో మాత్రం ఆ దేశానికి ప్ర‌ముఖ‌ స్థానం ల‌భించింది. చాలాకాలం నుంచీ వీడ‌ని అంతర్గత క‌ల్లోలంతోపాటు ఆర్థికాభివృద్ధి లేమిలో చిక్కుకున్న ఈ దేశం- సుల్తాన్ ఖ‌బూస్ నాయకత్వంలో గణనీయ ప్ర‌గ‌తివైపు ప‌య‌నిస్తోంది. సుల్తాన్ 1970లో పాల‌న బాధ్య‌త‌లు స్వీక‌రించాక సంక్షేమం దిశ‌గా చమురు సంపదను మ‌ళ్లించారు. త‌ద్వారా ఆర్థిక పురోగతి సాధించి, ప్ర‌జా శ్రేయస్సువైపు న‌డిపారు. అంతేకాకుండా సుల్లాన్ ఖ‌బూస్ నేతృత్వాన ఒమ‌న్‌కు ఇరుగుపొరుగు దేశాల‌తో సంబంధాల్లో స‌మ‌తూకం సాధ్యమైంది. దీంతో ముక్క‌చెక్క‌లుగా ఉన్న జ‌ల‌సంధి ప్రాంతంలో కీల‌క పాత్ర పోషించే వీలు ఏర్ప‌డింది. ఆ మేర‌కు ప్రాంతీయ ఉద్రిక్త‌త‌ల‌ను ఉప‌శ‌మింప‌జేయ‌డంలో, ప‌రోక్ష దౌత్య‌మ‌ద్ద‌తు ద్వారా వివాదాస్ప‌ద అంశాల ప‌రిష్కారంలో ఒమ‌న్ పోషించిన పాత్ర ఆ దేశ ప్రాముఖ్యాన్ని చాటుతోంది.

ఒమ‌న్ ప్రాముఖ్యాన్ని గుర్తించిన భార‌త్- కొన్ని ద‌శాబ్దాలుగా ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాల‌ను బ‌లోపేతం చేసుకుంటూ వ‌స్తోంది. త‌ద‌నుగుణంగా ఒమ‌న్‌తో రాజ‌కీయ‌, దౌత్య‌, వాణిజ్య‌, వ్యూహాత్మ‌క బంధం మ‌రింత దృఢ‌ప‌డుతోంది. ఆ విధంగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వాన గ‌ల్ఫ్ ప్రాంతంతో భార‌త సుహృద్భావ రాజ‌కీయ, దౌత్య సంబంధాల‌కు ప్రాముఖ్యంగ‌ల దేశాల జాబితాలో చేరింది. ప్ర‌ధాన‌మంత్రిగా 2014 జూన్‌లో మోదీ బాధ్య‌త‌లు స్వీక‌రించాక ఆయ‌న‌తో స‌మావేశ‌మైన తొలి విదేశీ ప్ర‌ముఖుడు ఒమ‌న్ విదేశాంగ శాఖ మంత్రి యూసుప్ బిన్ అలావీ కావ‌డం ఈ సంద‌ర్భంగా గ‌మ‌నార్హం. ఆ త‌ర్వాత 2015 ఫిబ్ర‌వ‌రిలో ఆనాటి మ‌న‌ విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి సుష్మాస్వ‌రాజ్ ఒమ‌న్‌లో ప‌ర్య‌టించారు. అటుపైన నాటి ర‌క్ష‌ణ మంత్రి మ‌నోహ‌ర్ ప‌రిక‌ర్ 2016 మే నెల‌లో ఒమ‌న్‌ను సంద‌ర్శించారు.

అనంత‌రం 2018 ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఒమ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాక ద్వైపాక్షిక సంబంధాలు మ‌రింత ముందడుగు వేశాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సుల్తాన్ ఖ‌బూస్‌తో స‌మావేశం కాగా, ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నాలుగ‌ల అనేక ప్ర‌ధాన ద్వైపాక్షిక, ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ‌ అంశాల‌పై నాయ‌కులిద్ద‌రూ లోతుగా చ‌ర్చించారు. అలాగే వాణిజ్యం, పెట్టుబ‌డుల‌ద్వారా మెరుగుప‌డుతున్న వాణిజ్య సంబంధాలు, ఉగ్ర‌వాదం నుంచి ప‌ర‌స్ప‌రం ఎదుర‌వుతున్న స‌వాళ్ల నిరోధం దిశ‌గా భ‌ద్ర‌త సంబంధాల బ‌లోపేతం త‌దిత‌రాలు కూడా ఈ స‌మావేశంలో ప్ర‌ముఖంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. అలాగే స‌ముద్ర భ‌ద్ర‌త దిశ‌గా స‌మ‌ష్టి కృషికి స‌మ్మ‌తిస్తూ భార‌త‌-ఒమ‌న్ ఒప్పందానికి వ‌చ్చాయి. దీంతోపాటు ర‌క్ష‌ణ రంగ సంబంధిత అవ‌గాహ‌న ఒప్పందానికి అనుబంధం చేర్పుపై సంత‌కం చేసేందుకు రెండు దేశాలూ అంగీక‌రించాయి. దీనివ‌ల్ల హిందూ మ‌హాస‌ముద్రంలో గ‌స్తీ బాధ్య‌త‌లు చేప‌ట్టే భార‌త నావికాద‌ళ నౌక‌ల నిర్వ‌హ‌ణ ప‌నుల కోసం ఒమ‌న్‌లోని వ్యూహాత్మ‌క దుఖ్మ్ రేవులోని నావ‌లు నిలిపే ప్ర‌దేశాన్ని వాడుకునే వీలుంటుంది.

రెండు దేశాల మ‌ధ్య వ్యూహాత్మ‌క సంబంధాలు వృద్ధి చెందుతున్న నేప‌థ్యంలో భార‌త ప్ర‌స్తుత విదేశాంగ శాఖ మంత్రి డాక్ట‌ర్ ఎస్‌.జైశంక‌ర్ ఈ వారం మొద‌ట్లో ఒమ‌న్‌ను సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ఇత‌ర ప్ర‌ముఖుల‌ను క‌లుసుకోవ‌డంతోపాటు ఒమ‌న్ విదేశాంగ శాఖ మంత్రి యూసుఫ్ బిన్ అలావీతో ప‌ర‌స్ప‌ర ప్ర‌యోజ‌నంగ‌ల ప్ర‌ధానాంశాల‌పై ఆయ‌న చ‌ర్చించారు. అదే స‌మ‌యంలో స‌ముద్ర ర‌వాణా రంగంలో కుదిరిన ఒక‌ ఒప్పందంపై ఉభ‌య‌ప‌క్షాలూ సంత‌కాలు చేశాయి. అటుపైన మ‌స్క‌ట్‌లోని భార‌తీయుల‌తోనూ జైశంక‌ర్ స‌మావేశ‌మ‌య్యారు. అక్క‌డి విదేశీయుల‌లో భార‌తీయుల సంఖ్య 7 ల‌క్ష‌ల 80 వేలు కాగా, ఒమ‌న్ ఆర్థికాభివృద్ధిలో వారిది కీల‌క‌పాత్ర కావ‌డం విశేషం. మ‌రోవైపు ఒమ‌న్‌కు భార‌త‌దేశం ప్ర‌ధాన వాణిజ్య భాగ‌స్వామిగానూ ఉంది. రెండు దేశాల మ‌ధ్య 2018-19లో ద్వైపాక్షిక వాణిజ్యం 5 బిలియ‌న్ డాల‌ర్ల స్థాయికి చేర‌డం ఇందుకు నిద‌ర్శ‌నం. అంతేకాకుండా ఇంధ‌న‌, ఎరువుల దిగుమ‌తిద్వారా ప్ర‌ధాన దిగుమ‌తుల భాగ‌స్వామిగానూ ఒమ‌న్‌తో భార‌త్‌కు బ‌ల‌మైన బంధముంది.

జ‌ల‌సంధిలో భార‌త దేశానికి ప్రాముఖ్యంగ‌ల వ్యూహాత్మ‌క భాగ‌స్వామిగా ఒమ‌న్‌ను ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు విదేశాంగ శాఖ వ్య‌వ‌హారాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. విదేశాంగ శాఖ మంత్రి డాక్ట‌ర్ జైశంక‌ర్ ఒమ‌న్ ప‌ర్య‌ట‌న‌వ‌ల్ల విస్తృత ద్వైపాక్షిక‌, ప్రాంతీయ‌, అంత‌ర్జాతీయ అంశాల‌పై అక్క‌డి రాజ‌కీయ నాయ‌కత్వంతో లోతైన చ‌ర్చ‌లు నిర్వ‌హించే అవ‌కాశం భార‌త్‌కు ల‌భించింది. అంతేగాక ప్రాంతంతో, ఒమ‌న్‌తో భార‌త్ సంబంధాలు మ‌రింత ముందుకెళ్లేందుకు జైశంక‌ర్ ప‌ర్య‌ట‌న తోడ్ప‌డింది. ఈ విధంగా ఉన్న‌త‌స్థాయి నేత‌ల ప‌ర్య‌ట‌న‌ల‌వ‌ల్ల ఒమ‌న‌తో భార‌త దౌత్య‌, రాజ‌కీయ బంధం ఇంకా బ‌లోపేత‌మ‌వుతుంది. గ‌ల్ఫ్ ప్రాంతంతో సంబంధాలు ముమ్మ‌రం చేసుకోవ‌డం ద్వారా ఇరుగుపొరుగును విస్త‌రించుకోవాల‌న్న భార‌త్ యోచ‌న‌కు అనుగుణంగా ఈ ప‌ర్య‌ట‌న‌లు సాగ‌డం విశేషం.

ర‌చ‌న: డాక్ట‌ర్ మొహ్మ‌ద్ ముద‌స్స‌ర్ ఖౌమ‌ర్‌, ప‌శ్చిమాసియాపై వ్యూహాత్మ‌క విశ్లేష‌కులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన