క‌ర్తార్‌పూర్ మార్గం... రాక‌పోక‌లకు సిద్ధం

భార‌త్‌, పాకిస్థాన్‌ల మ‌ధ్య ద్వైపాక్షిక ఉద్రిక్త‌త‌ల నడుమ క‌ర్తార్‌పూర్ సాహిబ్ మార్గంలో యాత్రికుల రాక‌పోక‌ల‌కు రెండు దేశాలూ అంగీకారానికి వ‌చ్చాయి. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రం న‌రోవాల్ జిల్లాలోగ‌ల ద‌ర్బార్ సాహిబ్ గురుద్వారాలో ప్రార్థ‌న‌ల కోసం సిక్కులు ఈ మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుంది. సిక్కుమ‌త ఆవిష్క‌ర్త శ్రీ గురునాన‌క్ దేవ్ నివ‌సించిన ప్ర‌దేశ‌మే క‌ర్తార్‌పూర్ సాహిబ్. సిక్కుల ఆరాధ్య‌దైవమైన గురునాన‌క్ 18 ఏళ్ల‌పాటు ప్రబోధం చేయ‌డ‌మేకాకుండా తుదిశ్వాస విడిచింది కూడా అక్క‌డే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో సిక్కుల తొలి గురువు నాన‌క్ 550వ జ‌యంతి సంద‌ర్భంగా న‌వంబ‌రులో క‌ర్తార్‌పూర్ మార్గాన్ని తిరిగి తెర‌వ‌బోతుండ‌టం విశేషం. ఈ మార్గంలో నాలుగు వ‌రుస‌ల ర‌హ‌దారి నిర్మాణాన్ని భార‌త ప్ర‌భుత్వం నిరుడు న‌వంబ‌రులో పూర్తిచేసింది. మన దేశ పరిధిలోని గురుదాస్‌పూర్ జిల్లాలోగ‌ల డేరా బాబా నాన‌క్ నుంచి ప్రారంభ‌మై అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ర‌కూ ఈ రహదారి సాగుతుంది. పాకిస్థాన్‌లోగ‌ల‌ సుమారు 173 సిక్కు ప్రార్థ‌న స్థ‌లాల్లో కొన్ని మాత్ర‌మే సిక్కు యాత్రికుల‌కు అందుబాటులో ఉన్నాయి. భార‌త‌-పాకిస్థాన్‌ల మ‌ధ్య 1974లో కుదిరిన ఒడంబ‌డిక మేరకు త‌మ‌త‌మ ప‌రిధిలోని వివిధ మ‌తాల ప్రార్థ‌న స్థ‌లాల‌కు వెళ్లడానికి రెండు దేశాలూ యాత్రికుల‌ను అనుమ‌తిస్తున్నాయి.

సిక్కు యాత్రికులకు ఇంతకుముందు మన సరిహద్దులోని డేరాబాబా నానక్ వద్ద ఏర్పాటు చేసిన దూరదర్శిని సాయంతో మాత్రమే కర్తార్‌పూర్‌లోని ద‌ర్బార్ సాహిబ్ గురుద్వారా ‘ద‌ర్శన’ భాగ్యం లభించేది. ‘‘వైశాఖి పండుగ‌, గురు అర్జున్ దేవ్ అమ‌ర‌త్వ సిద్ధి, మ‌హారాజా రంజిత్ సింగ్ వ‌ర్ధంతి, గురునాన‌క్ దేవ్ జ‌యంతి’’- ఈ నాలుగు సంద‌ర్భాల్లో... అదీ ప‌రిమిత సంఖ్యలో యాత్రికుల‌ను పాకిస్థాన్ అనుమ‌తించ‌డమే ఇందుకు కార‌ణం.

దర్బార్ సాహిబ్ గురుద్వారాను ఒక మార్గంద్వారా అనుసంధానించి భార‌త్ నుంచి వెళ్లే సిక్కు యాత్రికుల‌కు అందుబాటులోకి తేవాల‌న్న ప్ర‌తిపాద‌న చాలాకాలం నుంచీ ఉంది. క‌ర్తార్‌పూర్ సాహిబ్‌లో పున‌ర్నిర్మాణ ప‌నుల‌ను 1999లో ప్రారంభించిన త‌ర్వాత ప్ర‌ధాన‌మంత్రి వాజ్‌పేయి చారిత్ర‌క లాహోర్ బ‌స్సు యాత్ర సంద‌ర్భంగా ఈ మార్గం నిర్మాణానికి భార‌త్ ప్ర‌తిపాదించింది. అదే ఏడాదిలో కంటితుడుపు చ‌ర్య‌గా ‘పాకిస్థాన్ గురుద్వారా ప్ర‌బంధ‌క్ క‌మిటీ’ని పాకిస్థాన్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఐఎస్ఐ మాజీ డీజీ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ జావీద్ నాసిర్ ఈ క‌మిటీకి అధ్య‌క్షుడుగా నియ‌మితులయ్యారు. ఆ మేర‌కు పాకిస్థానీ సిక్కులు అక్క‌డి త‌మ ప్రార్థ‌న స్థ‌లాల‌ను తామే నిర్వ‌హించుకునేందుకు ప్రభుత్వం అనుమ‌తించింది. కానీ, ఇది ‘‘పాకిస్థాన్ కాందిశీకుల ట్ర‌స్ట్ ప్రాప‌ర్టీ బోర్డు’’ కింద ప‌నిచేయాల్సి వ‌చ్చేది కాబ‌ట్టి ఆ క‌మిటీ స్వ‌యంప్ర‌తిప‌త్తి నామ‌మాత్రంగానే మిగిలింది.

ఈ నేప‌థ్యంలో ద‌ర్బార్ సాహిబ్ గురుద్వారా సంద‌ర్శన‌ను సిక్కు యాత్రికుల‌కు అందుబాటులోకి తేవ‌డంలో భాగంగా క‌ర్తార్‌పూర్ సాహిబ్ మార్గాన్ని తెరిచేందుకు పాకిస్థాన్ ఎట్ట‌కేల‌కు సంసిద్ధ‌త ప్ర‌క‌టించింది. దీంతో ఈ ఏడాది మార్చిలో అట్టారీ స‌రిహ‌ద్దువ‌ద్ద రెండు దేశాల అధికారులు తొలిసారి స‌మావేశ‌మై క‌ర్తార్‌పూర్ మార్గం నిర్వ‌హ‌ణ‌ విధివిధానాలపై చర్చించారు. అయితే, ద‌ర్బార్ సాహిబ్ గురుద్వారా సంద‌ర్శించే యాత్రికులకు ప‌ర్మిట్ వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెడతామ‌ని, దీంతోపాటు త‌లా 20 డాల‌ర్ల వంతున రుసుము విధిస్తామ‌ని పాకిస్థాన్ ప్ర‌తిపాదించింది. క‌ర్తార్‌పూర్ మార్గం నిర్వ‌హ‌ణ కోస‌మే రుసుము విధింపును ప్ర‌తిపాదిస్తున్న‌ట్లు వాదించింది. కానీ, ఇది ఆమోద‌యోగ్యం కాద‌ని, ఈ మార్గాన్ని యాత్రికుల‌కు ఉచితంగా అందుబాటులో ఉంచాల‌ని భార‌త్ స్ప‌ష్టం చేసింది. గురుద్వారా సంద‌ర్శ‌న‌కు రుసుము విధిస్తే ఆ ప‌విత్ర యాత్రాస్థ‌లం పేద‌ ప్ర‌జ‌లకు అందుబాటులో ఉండ‌ద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. అలాగే యాత్రికుల వెంట దౌత్య‌, స‌మ‌న్వ‌య అధికారుల‌ను అనుమ‌తించాల‌ని కోరింది. కానీ... ఈ రెండు అంశాల‌పై ఒక అంగీకారం కుద‌ర‌లేదు. కాగా- పంజా సాహిబ్‌, నాన‌కానా సాహిబ్ గురుద్వారాల‌ను సంద‌ర్శించే సిక్కు యాత్రికుల‌ను క‌లుసుకునేందుకు భ‌ద్ర‌త కార‌ణాల సాకుతో భార‌త హైక‌మిష‌న్ అధికారుల‌ను పాక్ లోగడ అనుమ‌తించేది కాదు.

వీసా లేకుండా యాత్రికులను అనుమ‌తించేందుకు రెండు దేశాలూ అంగీక‌రించిన‌ప్ప‌టికీ వారు త‌ప్ప‌నిస‌రిగా పాస్‌పోర్టులు తీసుకురావాల‌ని, ఆన్‌లైన్ ద్వారా పేర్లు న‌మోదు చేసువాల‌ని నిర్ణ‌యించాయి. ఇక రోజుకు 10వేల మంది యాత్రికుల‌ను అనుమ‌తించాల‌ని భార‌త్ విజ్ఞ‌ప్తి చేయ‌గా, చివ‌ర‌కు 5వేల మందిని అనుమ‌తించేందుకు... ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో ఈ సంఖ్య‌ను పెంచ‌డానికి అంగీకారం కుదిరింది.

అయితే, కర్తార్‌పూర్‌కు యాత్రికుల రాక‌ను సొమ్ము చేసుకోవాల‌ని భార‌త వ్య‌తిరేక దుష్ట‌శ‌క్తులు త‌ల‌పెట్టాయి. ఆ మేర‌కు పాకిస్థాన్ ద‌న్నుతో భార‌త్‌లో విధ్వంస‌క కార్య‌క‌లాపాలకు పాల్ప‌డ‌టానికి ఆ శ‌క్తులు వారి మ‌ద్ద‌తు కోరాయి. ఇది భార‌త్‌కు ఎంతో ఆందోళ‌న క‌లిగించే అంశం. పంజాబ్‌లో ఇంత‌కుముందు తీవ్ర‌వాదుల‌ను ప్రోత్స‌హించిన పాకిస్థాన్- మ‌రోసారి తీవ్ర‌వాదాన్ని ఎగ‌దోసే ప్ర‌మాదం ఉంద‌న్న‌ది భార‌త్ సందేహం. దీనికితోడు క‌ర్తార్‌పూర్ నిర్వ‌హ‌ణ క‌మిటీలో భార‌త వ్య‌తిరేకిగా ముద్ర‌ప‌డిన‌ గోపాల్ సింగ్ చావ్లాను పాకిస్థాన్ నియ‌మించ‌డంతో ఈ మార్గం నిర్మాణ ప‌థ‌కం వివాదంలో ప‌డింది. స‌ద‌రు గోపాల్ చావ్లా ఇంత‌కుముందు తీవ్ర‌వాదుల నిర్వాహ‌కుడు కావ‌డంతోపాటు అనేక దేశాల్లో అత‌డిపై నిషేధం ఉండ‌టం ఈ సంద‌ర్భంగా గ‌మ‌నార్హం.

సిక్కులు పవిత్రంగా భావించే పుణ్యక్షేత్రాలలో ఒకదానితో యాత్రికుల అనుసంధానం కోసం కర్తార్‌పూర్ మార్గాన్ని తెర‌వ‌డం ఓ కీల‌క ముంద‌డుగు. ప్రస్తుత అల్లకల్లోల ద్వైపాక్షిక సంబంధాల న‌డుమ ఇదొక ‘‘శాంతి మార్గం’’ కాగ‌ల‌ద‌న్న ఆశాభావం వ్య‌క్త‌మ‌వుతోంది.

రచన: డాక్టర్ స్మృతి ఎస్.పట్టనాయక్, దక్షిసియా అంశాల వ్యూహాత్మక విశ్లేషకులు

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన