భద్రతా సహకారాన్ని పటిష్టం చేసుకుంటున్న ఇండియా-ఉజ్బెకిస్తాన్‌లు

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడానికి సంబంధించి ‘ఇండియా-ఉజ్బెకిస్తాన్ జాయింట్ వర్కింగ్ గ్రూపు’ ఎనిమిదవ సమావేశం న్యూ ఢిల్లీలో జరిగింది. ఇరుదేశాలకు చెందిన సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దు తీవ్రవాదం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను రెండు దేశాలూ క్షుణ్ణంగా పరిశీలించాయి. ఆయా ప్రాంతాలలోనే కాదు ప్రపంచంలోని పలు ప్రాంతాలలో ఉగ్రవాద బృందాలు తమ కార్యకలాపాలను విస్తృతంగా నిర్వహించడాన్ని గమనించాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఎదుయ్యే సవాళ్లను కూడా రెండు దేశాలూ చర్చించాయి. అంతేకాదు రాడికలైజేషన్, ఉగ్రవాదశక్తులకు నిధుల సహాయంపై పోరాటం, ఉగ్రవాదచర్యలకు అంతర్జాలాన్ని వినియోగించడాన్ని నిరోధించడం, విదేశీ ఉగ్రవాదులను తిరిగి అప్పగించే ఒప్పందాలకు సంబంధించిన పలు విషయాలను ఈ సమావేశంలో ఇరుదేశాలు లేవనెత్తాయి. సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించుకోవడం, సామర్థ్య పెంపుదల, మంచి విధానాలను అనుసరించడం ద్వారా ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ద్వైపాక్షిక సహకారాన్ని పటిష్టం చేసే చర్యలను కూడా ఇరుదేశాల అధికారులు చర్చించారు.

ఈ సమావేశంలో ఇంకొన్ని ముఖ్య విషయాలను కూడా ఇరుదేశాలూ పంచుకున్నాయి. బహుపక్ష వేదికలపై సహకారం ఆవశ్యకతను రెండు దేశాలూ గుర్తించాయి. ‘యుఎన్’, ‘షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్’ (ఎస్‌సివొ), ‘రీజనల్ యాంటి-టెరర్రిస్ట్ స్ట్రక్చర్’ (ఎస్‌సివొ-ఆర్ఎటిఎస్), ‘యురేషియన్ గ్రూప్ ఆన్ కంబాటింగ్ మనీ లాండరింగ్ అండ్ ఫైనాన్సింగ్ ఆఫ్ టెర్రరిజం’ (ఇఎజి) వేదికలపై సైతం సహకారం అందించుకొనే అంశాన్ని ఇరుదేశాల అధికారులు సమావేశంలో లేవనెత్తారు. భారత్ 2017 సంవత్సరం నుంచి ఎస్‌సివొలో పూర్తిస్తాయి సభ్యురాలు. ఎస్‌సివొ 19వ శిఖరాగ్ర సమావేశం గత నెల కిర్జిస్తాన్‌లోని బిష్కెక్‌లో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ సమావేశంకు హాజరవుతూ ‘ఆర్ఎటిఎస్’ ఉగ్రవాదాన్ని ఎరివేయడంలో శక్తివంతంగా శోధించి పనిచేయాలని అభిప్రాయపడ్డారు.

భద్రతా సహకారంపై కూడా ఇరు దేశాలూ చర్చించాయి. భారత్, ఉజ్బెకిస్తాన్‌ రెండు దేశాలు కూడా తమ రాజకీయ, ఆర్థిక కార్యకలాపాలను బాగా పెంచాయి. రెండు దేశాలకూ సుసంపన్నమైన నాగరికత, సంస్కృతీ మూలాలు ఉన్నాయి. వీటి మధ్య సంబంధాలు మిలీనియా కన్నా ముందు నుంచి ఉండడం గమనించవచ్చు. ప్రస్తుతం రెండు దేశాలూ తమ ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకునే దిశగా విస్తరించే పనిలో ఉన్నాయి. ఉన్నత రాజకీయ స్థాయిలో నిత్యం ఈ రెండు దేశాల మధ్య సమావేశాలు జరుగుతున్నాయి. 2015లో మధ్య ఆసియాలో పర్యటించేటప్పుడు ఉజ్బెకిస్తాన్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఉజ్బెకిస్తాన్ ప్రెసిడెంట్ షౌవ్‌కత్ మర్జియోయెవ్ 2018 అక్టోబర్ నుంచి రెండు పర్యాయాలు భారత్‌లో పర్యటించారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షికంగా, ప్రాంతీయంగా సహకార పెంపుదల లక్ష్యంగా భారత్‌లో ఆయన పర్యటించారు. 2018 సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకూ భారత దేశ పర్యటనలో మర్జియోయెవ్ ఉన్నారు. మళ్లా 2019 జనవరిలో వైబ్రంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చారు. ఈ సదస్సుకు తన వెంట అత్యున్నత అధికారగణాన్ని కూడా ఆయన తీసుకువచ్చారు. శిఖరాగ్ర సదస్సు జరిగే సమయంలోనే ఆయన ప్రధాని నరేంద్రమోదీని ప్రత్యేకంగా కలిశారు.

మధ్య ఆసియాలో ఉజ్బెకిస్తాన్‌కి ఎంతో కీలకమైన స్థానం ఉంది. దాని భౌగోళిక, జనాభా పరిస్థితులు అలాంటివి. ఈ దేశంలో 33 మిలియన్ల మంది ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతంలో అత్యధిక జనాభా ఉన్న దేశం ఇది. మధ్య ఆసియాకు భూమార్గం లేదు. మధ్య ఆసియా మధ్య భాగంలో ఉజ్బెకిస్తాన్ ఉంది. అయితే ఈ ప్రాంతంలో ఇతర ప్రాంతీయ రిపబ్లిక్కులతో, ఆఫ్ఘనిస్తాన్‌తో కూడా సరిహద్దులను పంచుకుంటున్న ఏకైక దేశం ఉజ్బెకిస్తానే. మధ్య ఆసియాలో ఈ దేశం వ్యూహాత్మకంగా భారత్‌కు ముఖ్యమైన దేశం. అంతేకాదు మధ్య ఆసియా ప్రాంతంతో సంబంధాలు న్యూఢిల్లీకి ఎంతో ముఖ్యమైనవి. ఇండియా, ఉజ్బెకిస్తాన్ దేశాలు రెండూ ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి, సుస్థిరతల అవసరాన్ని గుర్తించాయి. ఆ ప్రాంతం మొత్తం భద్రత, సుస్థిరతలకు చాలా ముఖ్యమని కూడా రెండు దేశాలూ గుర్తించాయి. ఈ సంవత్సరం జనవరిలో సమర్ఖాండ్‌లో విదేశీ మంత్రుల స్థాయిలో జరిగిన ఇండియా-సెంట్రల్ ఆసియా డయొలాగ్ ప్రారంభానికి తొలిసారి ఆతిథ్యమిచ్చిన దేశం కూడా ఉజ్బెకిస్తానే.

వికాసవంతమైన రాజకీయ సంబంధాలు ఉన్నప్పటికీ, వివిధ రంగాలలో సహకారాన్ని విస్తృతపరచుకుంటునప్పటికీ ఇరు దేశాల మధ్య వాణిజ్యం వాటి సామర్థ్యాని కన్నా కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. భారత వాణిజ్య శాఖ చెబుతున్న సమాచారం బట్టి 2018-19 సంవత్సరంలో రెండు దేశాల మధ్య 328.14 మిలియన్ అమెరికన్ డాలర్ల వాణిజ్యం ఉంది. ఏమైనప్పటికీ అనుకూలమైన, ఆశావహమైన అంశం ఏమిటంటే గత రెండు మూడు సంవత్సరాల కాలంలో ఇరుదేశాల మధ్య వాణిజ్యం ఎంతో వేగవంతంగా వృద్ధి చెందింది. అది 2018-19లో 40 శాతం వాణిజ్యం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 50 శాతం పెరిగినట్టు గణాంకాలు చెప్తున్నాయి. 2020 సంవత్సరం నాటికి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఒక బిలియన్ అమెరికన్ డాలర్లకు చేర్చాలని ఇరు దేశాలూ లక్ష్యం పెట్టుకున్నాయి.

లైన్ ఆఫ్ క్రెడిట్ కింద 200 మిలియన్ అమెరికన్ డాలర్లను ఉజ్బెకిస్తాన్‌కు భారత్ ప్రకటించింది. రెండు దేశాల్లో ఆర్థికపరమైన శక్తిసామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ తన ప్రత్యేక ఆర్థిక మండళ్లల్లో, పర్యాటకం, ఐటి, విద్య, ఔషధాలు, హెల్త్ కేర్, యాగ్రి-బిజినెస్ వంటి వాటిల్లో భారత్ నుంచి పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలను ఉజ్బెకిస్తాన్ చేస్తోంది. భూమార్గం లేదా సముద్ర మార్గం నుంచి ఎలాంటి అనుసంధానత మధ్య ఆసియాకు లేకపోవడం వల్ల ఇరు దేశాల ద్వైపాక్షిక ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోంది. భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాలు వివిధ బహుపక్ష కార్యక్రమాల ద్వారా ఇరుదేశాల మధ్య అనుసంధానతకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అష్గాబత్ ట్రాన్సిట్ కారిడార్ అగ్రిమెంట్‌లో ఉజ్బెకిస్తాన్, తుర్కెమెనిస్తాన్, ఒమన్, ఇరాన్‌లు ఉన్నాయి. అంతేకాదు ఇరాన్ లోని ఛబాహర్ రేవుపై కూడా ఉజ్బెకిస్తాన్ పెట్టుబడి పెడుతోంది. ‘ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌ పోర్టు కారిడార్ (ఐఎస్ఎస్‌టిసి) అనే మరో బహుపక్ష కార్యక్రమం కూడా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియాలతో భారత్ అనుసంధానతను సులభతరం చేస్తుంది. 

రచన: డా. అథార్ జాఫర్, మధ్య ఆసియా వ్యూహాత్మక విశ్లేషకులు
  

Comments

Popular posts from this blog

భార‌త రాజ్యాంగం - దేశ అత్యున్న‌త శాస‌నం

నైజ‌ర్ - ట్యునీషియాల‌తో భార‌త్ గాఢ‌త‌ర‌మైన కార్య‌క‌లాపాలు

పాకిస్తాన్ లో అల్పసంఖ్యాక వర్గాల పై దౌర్జన్యం పట్ల అమెరికా ఆందోళన